మన దేశంలో కరోనా వైరస్ ప్రభావం అంతగా లేదు అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో మంత్రి ఈటల మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఇప్పటి వరకు ఒక్కరికి కూడా కరోనా వైరస్ సోకలేదని ఆయన స్పష్టం చేశారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి దుబాయిలో కరోనా సోకింది. ఆ వ్యక్తి రెండు రోజుల్లో డిశ్చార్జి కావొచ్చు అని మంత్రి పేర్కొన్నారు. మైండ్స్పేస్ ఉద్యోగికి కరోనా నెగిటివ్ వచ్చిందన్నారు. కరోనాపై అతిగా స్పందించొద్దు అని సూచించారు. కరోనా వచ్చిందంటూ ఒక సాఫ్ట్వేర్ కార్యాలయాన్ని ఖాళీ చేశారు. ఐటీ కంపెనీలు బాధ్యతతో వ్యవహరించాలి అని మంత్రి చెప్పారు.
కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందదు అని అన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఈటల భరోసానిచ్చారు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే సత్తా రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. కరోనా నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం అని ఆయన స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి అరికట్టేందుకు రాష్ట్రం తీసుకున్న చర్యలను చూసి కేంద్రం కితాబు ఇచ్చిందని మంత్రి తెలిపారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియా బాగా సహకరించిందని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా కరోనా రాకూడదని కోరుకుందామని ఈటల అన్నారు.